కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ.. షాకిచ్చిన టీఎంసీ, ఎస్పీ!

కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ.. షాకిచ్చిన టీఎంసీ, ఎస్పీ!

Last Updated : Oct 7, 2018, 10:06 AM IST
కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ.. షాకిచ్చిన టీఎంసీ, ఎస్పీ!

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పలు పార్టీలను కలుపుకొని పోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే బహుజన్ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగుతామని ప్రకటించారు. తాజాగా తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ కూడా అటువంటి ప్రకటనే చేసి కాంగ్రెస్‌కి చేదు వార్త అందించింది. ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న టీఎంసీ నేత చందన్‌ మిత్రా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో కలిసేది లేదని, పశ్చిమ బెంగాల్‌లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌తో పాటు ఏ పార్టీతోనూ కలిసి పోటీ చేసే అవసరం తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి లేదని తెలిపారు.

అటు సమాజ్‌వాది పార్టీ కూడా కాంగ్రెస్‌కు రాంరాం చెప్పింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో సమాజ్‌వాది పొత్తు లేదని అఖిలేష్ యాదవ్ ఓ మీడియా సమావేశంలో తేల్చేశారు. కాంగ్రెస్‌తో స్నేహం కోసం చాలాకాలం ఎదురు చూసినా ఆ పార్టీ పట్టించుకోలేదని.. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలతోనే నడవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు ఉండవచ్చనే అభిప్రాయం వెల్లడించారు. గోండ్వానా గణతంత్ర పార్టీ, మాయావతి బీఎస్పీతో పొత్తులు ఉంటాయన్నారు. కాగా కొద్దిసేపటి క్రితం సమాజ్ వాదీ పార్టీ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసే ఆరుగురు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

 

 

Trending News